ఇసుక కొరతపై రేపు విజయవాడ ధర్నాచౌక్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారని దీనికి మద్దతు పలకాలని తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు. పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన టిడిపి నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపాలని పవన్ ను కలిసి కోరాం, ఆయన కూడా సానుకూలంగా స్పందించి సంఘీభావం ప్రకటిస్తామని చెప్పారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, సిఎం జగన్ తీరు వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తిన్నదని అన్నారు. అందువల్లే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. సమస్యను పరిష్కరించాలని అడిగితే ఎదురు దాడి చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ప్రతిపక్షాల విధి. అయితే నిన్న పవన్ ప్రెస్ మీట్ పెట్టగానే ఒక మంత్రి వచ్చి మళ్లీ వ్యక్తిగతంగా ఆయనను దూషించారు ఇది కరెక్టు కాదు అని అచ్చెన్నాయుడు అన్నారు.