హిట్లర్ యూదులను అణచివేయాలని ఎంత ప్రయత్నించిన సాధ్యం కాలేదు. అలాగే ఏ వర్గాన్ని కానీ,ఏ పార్టీని కానీ అక్రమ పద్ధతుల్లో అణచివేయడం మీ వల్ల కాదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా అని ఎంపీ కేశినేని నాని అన్నారు. మాజీ మంత్రి,బీసీ నేత కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను ఆయన నివాసంలో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని తో బాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగులమీరా, టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ, రాష్ట్ర పార్టీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ఉన్నారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు..తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాలను అక్రమ పద్ధతుల ద్వారా అణచివేయాలనుకోవడం అమానుషమని నాని అన్నారు. వైసీపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లు ప్రతి రోజు కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా జగ్గయ్యపేట నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు.
ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు న్యాయానికి, ధర్మానికి విధేయులుగా ఉండాలి తప్ప, అధికార పక్షానికి కాదని గ్రహించాలని ఆయన అన్నారు. కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను, మామ గారు మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు లను పరామర్శించి, టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.