కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు పంచాయితీ నర్సన్నగారి పల్లె, టప్పటేరు పల్లె గ్రామాల్లో నీట మునిగిన పంటలు,ఇళ్లను ఆదివారం మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పరిశీలించారు.
నీట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సోమశిల బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ లో కెపాసిటికి మించి 78 టీఎంసీ నీటిని నిల్వ ఉంచడంతో, కొండల నుంచి వచ్చిన నీరు నదిలోకి పోలేక గ్రామాలను ముంచుతున్నదని వారు అన్నారు.
దీనివల్ల పెన్న పేరూరు పంచాయితీకి చెందిన నర్సన్న గారి పల్లె, టప్పటేరు పల్లె భూములు 200 ఎకరాలు నీట మునిగి వరి, పసుపు పంటలు పాడై పోయాయని వారు తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని వారు కోరారు. టప్పటేరు పల్లె భూములు మునిగి ఇళ్లలోకి నీరు చేరడంతో మునక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
పెన్న పేరూరు పంచాయతీ నర్సన్నగారి పల్లె ను కూడా ముంపు ప్రాంతంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మునకకు గురైన పొలాలను గ్రామాలను పరిశీలించి రైతులను పరామర్శించారు.