రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డిజిపి సవాంగ్ కి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ వారికి, ఇతర ప్రతిపక్షాలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆర్టికల్ 19ను నిషేధించినట్లుగా కనిపిస్తున్నదని ఆయన అన్నారు.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 ప్రకారం సంక్రమించిన భావ స్వేచ్ఛను రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాలకు దక్కకుండా ఇనుప పాదాలతో అణచి వేస్తున్నారని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనలో అధికార పార్టీ దాడిచేసి రాళ్లు, చెప్పులు విసిరితే అది వారి భావ స్వేచ్ఛ అని మీరు ఆర్టికల్ 19 గురించి రాష్ట్ర ప్రజలకు వివరించారు.
మీరు వివరించిన భావ స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీ వారికి, ఇతర ప్రతిపక్షాలకు వర్తించదా? రాష్ట్ర డిజిపిగా నిస్పక్షపాతంగా అందరిని ఒకేలా చూడవలసిన మీకు ఈ పక్షపాతం ఎందుకు? అని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిరసన కార్యక్రమం చేపట్టినా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ , సెక్షన్ 144 సి ఆర్ పి సి విధించి నిరసన తెలపకుండా నిరోధిస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు,ముందస్తు అరెస్టులు చేసి వారి భావ స్వేచ్ఛను హరిస్తున్నారని వర్ల రామయ్య తెలిపారు. వినుకొండ మాజీ MLA ఆంజనేయులును ఎందుకు నిర్బంధించారు, ఆయన చేసిన నేరం ఏమిటి? చెత్త పన్ను విధించిన ప్రభుత్వంపై నిరసన తెలియజేయలనుకోవడం ఆయన చేసిన నేరమా? అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు.