తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకోవాలని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సబ్ కలెక్టర్ ను కోరారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన నేడు సబ్ కలెక్టర్ ఇలాకియా తో సమావేశం అయ్యారు. రూరల్ నియోజకవర్గంలోని పెండింగ్ వర్క్స్, జరుగుతున్న అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు.
రూరల్ ప్రత్యేక అధికారిగా ఉన్న సబ్ కలెక్టర్ ఒకరోజు సమయం కేటాయించి నియోజకవర్గ, మండల స్దాయి అధికారులు పంచాయతి, రెవెన్యూ, అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు. వేమగిరిలో అక్రమ మైనింగ్ దారులు ఎనిమిది అడుగుల లోతు తవ్వి మట్టిని కొల్లగోడుతున్నారని ఆమె దృష్టికి తీసుకు వెళ్ళారు.
అదేవిధంగా ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయక దళిత,గిరిజన, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించలేక పోతున్నారని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేయాలని కోరారు.