39.2 C
Hyderabad
March 29, 2024 14: 36 PM
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాకు కన్నీరు తెప్పిస్తున్న గజెట్ నోటిఫికేషన్

#TDP MLAs

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోవడమే కాకుండా ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతున్న నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమర్ధిస్తున్నదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ మేరకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిరసన లేఖ రాశారు. వారు రాసిన లేఖ పూర్తి పాఠం:

ముఖ్యమంత్రి గారూ,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అత్యంత కరువు జిల్లాగా ప్రకాశం జిల్లా ఉన్నదనే విషయం మీకు విదితమే. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లా ప్రజానీకం, రైతాంగం ఏళ్ల తరబడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం మీకు తెలిసిందే.

ప్రకాశం జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలు, మీ సొంత కడప జిల్లాలోని ఒక నియోజకవర్గానికి తాగు, సాగునీటిని అందించే వెలుగొండ ప్రాజెక్టుకి అన్యాయం చేయొద్దని.. ప్రకాశం జిల్లా కలలను చెరిపివేయొద్దని.. మీరు వెంటనే స్పందించాల్సిన, అత్యంత కీలకమైన సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం.

కేంద్ర జలశక్తి శాఖ నిన్న జారీ చేసిన గెజిట్‌ లో ప్రకాశం జిల్లాపై పెద్ద పిడుగు పడిరది. వెలుగొండ ప్రాజెక్టుని అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించారు. ఇది విభజన చట్టానికి పూర్తి విరుద్ధం. ఈ సమస్యని సవివరంగా మీ దృష్టిలో పెడుతున్నాం. మీరు పరిష్కరిస్తారని మా ప్రజానీకం, మా రైతాంగం, మేము ఎదురు చూస్తున్నాం.. లేనిపక్షంలో వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తు కోసం ప్రజల పక్షాన నిలబడి ఎంతవరకైనా పోరాటానికి వెనుకాడమని హెచ్చరిస్తున్నాం..!

జిల్లా ప్రజల గొంతులు తడారాయి..!

తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన కృష్ణా, గోదావరి నదుల, నీటి ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్ళింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నుండి నిన్న ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గెజిట్‌ సారాంశం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న/ పూర్తయిన అయిదు ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టంలో ఉన్నట్టు ఈ గెజిట్‌ లో పేర్కొన్నారు. ఇది 2014 నాటి విభజన చట్టానికి పూర్తి విరుద్ధం. విభజన చట్టంలోని 11 వ షెడ్యూల్‌, సెక్షన్‌ 85 (7ఈ)లో నీటి ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంపై స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రాజెక్టులను (హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు) అనుకున్న ప్రకారమే పూర్తి చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ నిన్న కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లో అయిదు ప్రాజెక్టులను మాత్రమే విభజన చట్టం జాబితాలో చూపించారు. ‘‘వెలుగొండ’’ని వదిలేశారు. ఈ కీలకమైన ప్రాజెక్టుని ‘‘అనుమతిలేని ప్రాజెక్టు’’గా ‘‘అన్‌ అప్రూవ్డ్‌’’ విభాగంలో చూపించారు. నాడు అన్ని అనుమతులున్నాయని, పూర్తి చేయాలనీ విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొని.., నేడు అసలు అనుమతులు లేవని ఆరునెలల్లోగా అనుమతులు తీసుకోవాలని గెజిట్‌లో  ఇచ్చారు. (విభజన చట్టంలో 11 వ షెడ్యూల్‌ చదవండి. నిన్న కేంద్రం జరీ చేసిన గెజిట్‌ చూడండి)..! దీని వలన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోనుంది. పాతికేళ్లుగా నిర్మాణంలో ఉండి.., ప్రాజెక్టు నిర్మాణం తుదిదశకు చేరుకున్న తరుణంలో ఇలాంటి చర్యల వలన లక్షలాది గొంతులకు, లక్షలాది ఎకరాలకు నీటి చుక్క అందక దుర్భిక్షం నెలకొంటుంది. ఇది కరువుతో కొట్టుమిట్టాడుతున్న ప్రకాశం జిల్లాకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. వెలుగొండపై ఆశలు పెట్టుకున్న మా జిల్లా ఎడారిగా మారుతుంది.   

జిల్లా రైతుల గుండెలు బరువెక్కాయి..!

ముందుగా కృష్ణా నదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువభాగాన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు, ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ‘‘రాయలసీమ ఎత్తిపోతల’’ నష్టాలను వివరిస్తూ ఈ నెల 11న మీకు ఒక లేఖ రాశాము. దానిపై ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. మరోసారి గుర్తు చేస్తూనే.., వెలుగొండ కీలక సమస్యని మీ దృష్టిలో పెడుతున్నాం. శ్రీశైలం వద్ద తెలంగాణ చేపట్టిన మూడు ప్రాజెక్టులు ద్వారా 14 వేల క్యూసెక్కులు పోతుంటే.., ఏపీ ప్రభుత్వం ‘‘రాయలసీమ ఎత్తిపోతల  ప్రాజెక్టు వలన 80 వేల క్యూసెక్కులు నీరు పోతున్నాయి. ఆ ప్రాజెక్టు ద్వారా 805 అడుగుల వద్దనే నీటిని మళ్లించడం వలన వెలుగొండకు నీరు చేరే అవకాశమే లేదు. వెలుగొండ ద్వారా నీరు రావాలంటే కనీసం 850 అడుగుల నీటిమట్టం ఉండాలి. కానీ, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు మాత్రం 805 అడుగుల నీటిమట్టంలోనే 80 వేల క్యూసెక్కులు పోతున్నాయి. ఎగువ ప్రాంతంలోనే అడ్డగోలుగా నీటిని తోడేస్తే దిగువన ఉన్న నాగార్జున సాగర్‌ కి నీరు చేరక, దేశంలోనే రెండో అతిపెద్ద నీటి ప్రాజెక్టుగా ఉన్న సాగర్‌ అలంకార ప్రాయంగా మిగిలపోయే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టు దిగువన ఎడారిగా మారుతుంది. దీని వలన సాగర్‌ నీటినే నమ్ముకున్న ప్రకాశం జిల్లాలో సగం ప్రాంతం ఎడారిగా మారుతుంది. వర్షాల్లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు అన్యాయం చేయొద్దని మరోసారి తెలియజేసుకుంటున్నాం. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కేంద్రం నిన్న ఇచ్చిన గెజిట్‌ తో వెలుగొండపై మరో అతిపెద్ద పిడుగు పడిరది. ఆ గెజిట్‌ చూసి మా రైతుల గుండెలు బరువెక్కాయి. వెలుగొండపై ఆశలు పెట్టుకున్న లక్షలాది బతుకులు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలోకి వెళ్లిపోయాయి.

జిల్లా రైతు కుటుంబాలు మౌనంగా రోదిస్తున్నాయి…!

సీఎం గారూ…! దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న టాప్‌ – 50 జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. వర్షాభావ, కరువు పరిస్థితుల కారణంగా గడిచిన దశాబ్దం కాలంగా జిల్లాలో రైతుల బతుకులు తారుమారవుతున్నాయి. స్వేదం చిందించి, సేద్యం చేసే శక్తి ఉన్న రైతు కుటుంబాలు మౌనంగా రోదిస్తున్నాయి. ఖాళీ కడుపుతో వలసలు పోతున్నాయి. హలధారి కంట జలధార మంచిది కాదు. వారి కన్నీటిని తుడవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనపైనే ఉంది. అందుకే వెలుగొండ ఆశలు చిదిమేయొద్దు. నాగార్జున సాగర్‌ నీటిని దూరం చేయొద్దు. గడిచిన రెండు దశాబ్దాలుగా వర్షాల్లేక, నీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రాంతం మాది. మా జిల్లాలో 56 మండలాలుండగా 28 మండలాలు సాగర్‌ నీటిపైనా.., 23 మండలాలు వెలుగొండపైనా.., కొన్ని మండలాలు భూగర్భ జలాలపైనా ఆధారపడుతున్నాయి. సాగర్‌ నీరు అయిదేళ్లకో, ఆరేళ్లకో ఒకసారి మాత్రమే ఇస్తున్నారు. సాగర్‌ పరిధిలోని లక్షలాది మంది రైతులు భూములు బీడుగా వదిలేసి కూలీలుగా మారిపోయారు. వెలుగొండ నీరు వస్తే పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి తీరుతుందని ఏళ్ల తరబడి రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ సీమ ఎత్తిపోతల వలన ఒకరకమైన నష్టం వస్తుండగా.., నిన్న కేంద్రం గెజిట్‌ కారణంగా పూర్తిగా ప్రాజెక్టు మనుగడకే ముప్పు ఏర్పడింది. చూసీ, చూసీ అన్యాయానికి గురవుతుంటే రైతులు మౌనంగా ఉండలేరు. మౌన రోదన రైతులు ఎక్కువ కాలం భరించలేరు. మీరు వెంటనే స్పందించని పక్షంలో కరువు కడుపుల ఆకలి తీర్చని తప్పిదం చేసిన వారవుతారు. జిల్లా భవిత అగమ్యగోచరంగా మారితే చరిత్రలో మళ్ళీ ఈ తప్పుని సరిదిద్దుకోలేరు.

మా డిమాండ్లు :

1.వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే కేంద్రం గెజిట్‌ లో చేర్చాలి. ప్రాజెక్టుకి అన్ని అనుమతులు ఉన్నాయని కేంద్రం సమక్షంలో మళ్ళీ గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చేలా చూడాలి.

2.వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఇప్పటికే మీరు మాట మారుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని రెండేళ్లయినా ఇంకా పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుని ఎటువంటి ఆటంకాలు లేకుండా వెంటనే పూర్తి చేయాలి.

3.రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై పునరాలోచించాలి. వెలుగొండ ప్రాజెక్టు భవిష్యత్తుకి, నాగార్జున సాగర్‌ మనుగడకి ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం చూసి, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులకు నీటిని అందించాలి.

గొట్టి పాటి రవికుమార్, శాసన సభ్యులు, అద్దంకి నియోజకవర్గం

డోలా బాల వీరాంజనేయ స్వామి, శాసన సభ్యులు, కొండపి నియోజకవర్గం

ఏలూరి సాంబశివరావు, శాసన సభ్యులు, పర్చూరు నియోజకవర్గం

Related posts

ముఖేష్ అంబానీ ఇంట్లో మరో శుభకార్యం

Satyam NEWS

చిన్నారికి విజయవంతంగా లివర్ మార్పిడి శస్త్రచికిత్స

Satyam NEWS

భూ వివాదాల కేంద్ర బిందువు తిరుపతిపై కీలక నిర్ణయం

Satyam NEWS

Leave a Comment