కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు అమిత్ షా అప్పాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ, రైతుల సమస్యపై ప్రధాని మోడీతో జిరిగిన సమావేశం కారణంగా టిడిపి ఎంపీలతో భేటీ ఆలస్యం అయ్యింది.
టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని శ్రీనివాస్(నానీ), రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్లు అమిత్ షాని కలిశారు. మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో లేకపోవటంతో ఈ భేటీకి రాలేదు. మొత్తంగా 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది.
ఆధారాలతో సహా ఫిర్యాదులు అందించిన ఎంపిలు
టిడిపి ఎంపీలు అమిత్ షా తో భేటీ అయ్యి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తమ వద్ద ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా దేవాలయాలపై ఘటనలు, రాజ్యాంగ సంస్థలపై దాడితో పాటు రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్న ప్రభుత్వ వైఖరిని తమ ఫిర్యాదులో తెలిపారు.
అమిత్ షాతో భేటీ అయిన తరువాత, ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యాం అని, ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలు చెప్పాం అని తెలిపారు. కొన్ని వీడియోలు స్వయంగా అమిత్ షాకు చూపించినట్టు చెప్పారు.
మత మార్పిడులపై ఫిర్యాదు
ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న బలవంతపు మత మార్పిడులపై ఫిర్యాదు చేశామని, పాస్టర్ ప్రవీణ్కు సంబందించిన వీడియో చూసి, అమిత్ షా షాక్ అయ్యారని, దీనిపై మరిన్ని వివరాలు కావాలని కోరారని, ఆ వివరాలు ఇస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళామన్నారు.
కోర్టులపై వివిధ సందర్భాల్లో వైసిపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా ఆయనకు ఇచ్చామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ను టార్గెట్ చేసిన విధానం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా అమిత్ షాకు ఇచ్చామని ఎంపీలు పేర్కొన్నారు.
అయితే బుధవారం జరిగిన భేటీలో, అమిత్ షాకు సరైన సమాచారం లేదని అర్ధమైందని, జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని తప్పు దోవ పట్టించారని, వివరాలు అన్నీ చూసి, ఆధారాలు చూసి, అమిత్ షా స్పందించిన తీరుతో ఇది అర్థమైందని ఎంపీలు వ్యాఖ్యానించారు.
అమిత్ షా కూడా కొన్ని సంఘటనల మీద, మరిన్ని వివరాలు, ఆధారాలు ఇవ్వమని అడిగారని, అవన్నీ ఆయన కార్యాలయానికి అందజేస్తామని తెలుగుదేశం ఎంపీలు వెల్లడించారు.