ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడు అమెరికాలోని శాక్రమెంటో నగరంలో జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శాక్రమెంటో నగర నూతన పార్టీ కార్యవర్గ సభ్యులతో ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నారా లోకేష్ “యువగళం” పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.
ఎన్నో ఆశలతో ప్రజలు జగన్ రెడ్డికి అవకాశం ఇస్తే.. దానిని దుర్వినియోగం చేశారు. కేవలం కక్షసాధింపు కోసమే తన అధికారాన్ని వాడుతున్నారు. పాలకవర్గ దోపిడీతో ఏ వర్గం సంతోషంగా లేదు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలంటే ప్రజలకు పార్టీ మరింత చేరువ కావాలి. లోకేష్ పాదయాత్రను చూసి భయపడుతూ అనుమతులు కూడా నిరాకరిస్తున్నారు. యువగళాన్ని నిలువరించేందుకే ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేస్తూ జీవో నెం.1 తీసుకువచ్చారు. ప్రభుత్వ దోపిడీ, వైఫల్యాలపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యువగళం బాగా దోహదపడుతుంది.
ప్రవాసాంధ్రులు దీనిని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. బే ఏరియా నుండి తెలుగుదేశం నాయకుడు వెంకట్ కోగంటి ఎన్టీఆర్కు పుష్పాంజలి ఘటించారు. భాస్కర్ అన్నే , విజయ్ గుమ్మడి, పరుచూరి, కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, హర్ష, విజయ్ గింజుపల్లి, మధు, సాంబశివరావు గొల్లపూడి తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు