వై ఎస్ షర్మిల పార్టీకి చెందిన ఒక వ్యక్తి తెలుగుదేశం అధినేత ఎన్ చంద్రబాబునాయుడి కోడలు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మిణిపై అభ్యంతరకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పెడుతున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలా చేయవద్దు అంటూ హితవు పలికారు. అయితే అతను వినకుండా దురుసుగా సమాధానం చెప్పడంతో అతడికి దేహశుద్ధి చేశారు.
ఖమ్మం అర్బన్ మండలం టేకులపల్లిలో ఈ సంఘటన నిన్న జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహ అనే వ్యక్తి ఖమ్మంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. నారా బ్రాహ్మణిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా కించపరుస్తూ అతడు పోస్టులు పెట్టాడు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు కేతినేని హరీశ్, నల్లమల రంజిత్, నున్నా నవీన్, వక్కంతుల వంశీ తదితరులు కోదాటి నరసింహను ఫోన్ లో ప్రశ్నించటంతో ముస్తఫానగర్ వైతెపా కార్యాలయంలో ఉన్నానని చెప్పారు.
అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా ఎందుకు పోస్టులు పెట్టావని అడగటంతో దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాయకులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం తెదేపా లోక్ సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వ్యక్తులపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం వాడితే సహించేది లేదని హెచ్చరించారు.