సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిలోనే కొనసాగిస్తాను అని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల తరువాత మాటా మార్చారని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు.
మాట తప్పిన జగన్ మోహన్ రెడ్డి మడమ తిప్పి రాజధాని కోసం విలువైన భూములను ఇచ్చిన రైతులను నట్టేట ముంచారని ఆయన అన్నారు. రాజధాని అమరావతిలో ఉంటుంది, అందుకే నేను ఇక్కడ స్ధిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాను అని జగన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు రాష్ట్రానికి సెంటర్ పాయింట్ గా అమరావతిని ఎంపిక చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం చేసిన చట్టం ప్రకారం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.
ఆ రోజు జగన్ రెడ్డి కూడా రాజధానికి మా పార్టీ కూడా అనుకూలంగా అని చెప్పిన విషయాన్ని అరవింద బాబు గుర్తు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని భూములిచ్చిన రైతులు ఉద్యమిస్తే వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నేను చెప్పేదే వినాలి…. నా మాట వేద వాక్కు అంటూ 3 రాజధానులను ఖరారు చేయడం, దానికి గవర్నర్ గారు సంతకం పెట్టడం దురదృష్టకరమని అన్నారు.
ఈ రోజు రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూన్నారు. ఈ ప్రజ వ్యతిరేక విధానాల వలన రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలోకి పోతోంది అని చెప్పారు. అమరావతి సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గం నుండి నిరసన కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి కసా రాంబాబు, మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్ పాల్, టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి, శేఖర్, కొల్లి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.