అడ్డగోలుగా పెంచేసిన ఆర్టీసీ బస్సు చార్జీలతో పేదలు ఇబ్బంది పడుతున్నారని, పెంచిన బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. నరసరావుపేట RTC బస్టాండ్ ముందు జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో టీడీపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
ధర్నా లో పాల్గొన్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం బస్ చార్జీలు పెంచి సామాన్య ప్రయాణికులు పై భారాన్ని మోపిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను మరింత ఎక్కువ చేస్తూ ప్రభుత్వం బస్ చార్జీలు పెంచడం సబబు కాదని ఆయన అన్నారు.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉందని ఆయన అన్నారు. మొన్నటి వరకూ ఇసుక సమస్యతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి పేదలు బతకలేని పరిస్థితి తెస్తున్నారని డాక్టర్ చదలవాడ అన్నారు.