ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిరసన ర్యాలీ చేపట్టారు.తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసుతో నిరసన ర్యాలీలో అసెంబ్లీకి కాలినడకన చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. ఇసుక ధరలు పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా మారిన ఇసుక నేడు భారంగా మారిందని విమర్శలు గుప్పించారు.
కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
రాష్ట్రంలో నెలకొన్నఇసుక సమస్య వల్ల 30లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందని అచ్చెన్నాయుడు, శాసనసభాపక్ష ఉపనేత విమర్శించారు. టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుకను రద్దు చేసి కావాలనే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. పనుల్లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అవన్నీప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అవినీతి విధానమని పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. కొత్త విధానంపై ముఖ్యమంత్రి, మంత్రి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని, సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా నూతన ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్ కి వెళ్ళిందన్నారు
రాష్ర్టంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది
ఇసుక మాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసన సభాపక్ష ఉపనేత దుయ్యబట్టారు. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనంతా మైనింగ్ మాఫియాతో కుమ్మక్కైందని ఆరోపించారు. దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే ఉచిత ఇసుకను అమలు చేయట్లేదని విమర్శించారు.
సంక్షేమ నిధి నిర్వీర్యం
భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని నిర్వీర్యం చేశారని నిమ్మకాయల చినరాజప్పఆరోపించారు. రాష్ట్రంలో ఎవ్వరూ ఇళ్ల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇసుక మాఫియాపై రాబోయే కాలంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.