జగన్ మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు ఆరోపించడాన్ని బట్టి ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు.
నేర చరిత్ర కలిగిన జగన్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ద్వారా తనను అంతం చేయడానికి చూస్తున్నారని అయన భయపడి ప్రధానికి లేఖ రాయడమే ఇందుకు తార్కాణమన్నారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో తాను పిటిషన్ వేయడాన్ని సహించలేక పులివెందుల నేరగాళ్లను పిలిపించుకుని హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్నారని రాజు చెప్పడాన్ని పరిగణించాలన్నారు.
వివేకానంద హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గురువారం తాడేపల్లి నివాసంలో జగన్ ను కలవడం వెనుక కుట్ర దాగి ఉందని రాజు చెప్పడాన్ని పోలీసులు పరిశోధించాలి.
ఏడాది నుంచి జగన్ అవినీతి, అక్రమ పాలనను ఎండగడుతున్నందున రాజును అంతం చేసేందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
స్వంత పార్టీ వారికి భయపడి ఇప్పటికే ఆయన వై క్యాటగిరి రక్షణ పొందిన విషయాన్ని గుర్తు చేశారు. రాజు మీద ఈగ వాలినా తెలుగుదేశం పార్టీ సహించదని ఆయన హెచ్చరించారు. పార్టీలు వేరైనా బాధితులకు అండగా నిలవడం టిడిపి బాధ్యతగా భావిస్తుందన్నారు
కోటికత్తి డ్రామా, బాబాయ్ హత్యను గుండె పోటుగా చిత్రీకరించినట్టే అన్ని సమయాలలో చేయాలనుకుంటే కుదరదని జగన్ గ్రహించాలన్నారు.
రఘు రామకృష్ణ రాజు తీరు నచ్చక పొతే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి తప్ప ఇలాంటి అణచివేత చర్యలు మంచివి కాదని సుధాకర్ రెడ్డి హితవు చెప్పారు.