రెండు దశాబ్దాల పాటు అక్కడ సైకిల్ గుర్తు గెలవలేదు…. అలాగని తెలుగుదేశం పార్టీ ఆ స్థానంపై ఆశలు వదులుకోలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలలో అక్కడ సైకిల్ గుర్తు దూసుకుపోతున్నట్లు పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి…. ఏమిటా సీటు అని ఆలోచిస్తున్నారా?
అదే విశాఖపట్నం పార్లమెంటు స్థానం. 1999 తరువాత అక్కడ సైకిల్ గెలవలేదు. అయితే రెండు దశాబ్దాల తరువాత సైకిల్ అక్కడ దూసుకుపోనున్నదా అనే ప్రశ్నకు ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. తాత తరువాత ఇప్పుడు మనవడు అక్కడ గెలవనున్నాడు. 1999 లో విశాఖ ఎంపీ గా టీడీపీ తరపున ఎంవివిఎస్ మూర్తి విజయం సాధించారు. ఆ గెలుపే తెలుగుదేశం పార్టీకి ఆ పార్లమెంటు నియోజకవర్గంలో చివరిది.

తరువాత 2004 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విశాఖ ఎంపీ గా ఎన్.జనార్దన్ రెడ్డి గెలిచారు. 2009 లో కాంగ్రెస్ తరపున దగ్గుబాటి పురంధేశ్వరి గెలిచారు. 2014 లో కూటమిలో భాగంగా బీజేపీ కి ఈ సీటు కేటాయించడంతో బీజేపీ తరపున కంభంపాటి హరిబాబు విజయం సాధించారు. 2019లో ఎం వి వి సత్యనారాయణ వైసీపీ తరుపున అక్కడ విజయం సాధించారు.
ఈ సారి ఎం వి వి ఎస్ మూర్తి మనువడు భారత్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 2019 లోనే భరత్ విజయం సాధించాలి. అయితే జేడీ లక్ష్మీ నారాయణ పోటీలో ఉండడం తో భరత్, ఎం వి వి సత్యనారాయణ పై అత్యంత స్వల్ప మెజారిటీతో అంటే కేవలం 4414 ఓట్లు తేడాతో ఓడిపోయారు. అది క్రాస్ ఓటింగ్ వల్ల అలా జరిగిందని అందరూ అనుకున్నారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి 4,36,906 ఓట్లు రాగా ..భరత్ కు 4,32,492 ఓట్లు వచ్చాయి. జేడీ కి 2,88,874 ఓట్లు వచ్చాయి.. ఈసారి జనసేన, బీజేపీ పొత్తు టీడీపీ కి కలిసిరావడం…ఓట్లు చీలిక లేకపోవడంతో విశాఖ లో టీడీపీ జెండా ఎగురడం ఖాయం గా కనిపిస్తుంది.
పూడి రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, విశాఖపట్నం