పాలిటెక్నిక్ విద్యను పారిశ్రామిక రంగానికి మరింతగా అనుసంధానం చేసి విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్తును అందించే క్రమంలో హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకుంది. హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియా ప్రతినిధులతో మంగళగిరి సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసారు.
కాంచీపురం కేంద్రంగా ఆటోమోబైల్ రంగంలో కీలక భూమిక పోషిస్తూ బ్రేక్ల తయారీ, సరఫరాలో ఈ సంస్ధ అగ్రగామిగా ఉంది. సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణామండలి చైర్మన్ చదలవాడ నాగరాణి, హెచ్ఎల్ మండో ఆనంద్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ సారథి ఎంఓయుపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ డిప్లొమా విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ, ఉద్యోగ నియామకాలు, పారిశ్రామిక సంస్ధల సందర్శన, అతిథి ఉపన్యాసాలు, పాలిటెక్నిక్ పాఠ్యాంశాల రూపకల్పనలో పరిశ్రమల పాత్ర వంటి అంశాలలో మరింత సమన్వయం సాధించేలా ఈ ఒప్పందం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు, హచ్ఎల్ మండో ఆనంద్ గ్రూప్ మధ్య సహకారాన్ని ఈ ఒప్పందం బలోపేతం చేసుకునేందుకు ఉపకరిస్తుందన్నారు.
కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు వి పద్మారావు, ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగపు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఎవి రామకృష్ణ, హెచ్ఎల్ మండో ఆనంద్ గ్రూప్ నుండి మానవవనరులు విభాగపు డిజిఎం రాజశేఖర్ కంచర్ల, మేనేజర్ రాగిణి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.