అవినీతి రహిత సమాజం కోసం ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలవాలని తీన్మార్ మల్లన్న ములుగు జిల్లా టీం పిలుపునిచ్చింది. తీన్మార్ మల్లన్న టీం జిల్లా కో కన్వీనర్ అచ్చునూరి కిషన్ అధ్యక్షతన నేడు ములుగు జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు.
జిల్లా కన్వీనర్ మొగుళ్ళ భద్రయ్య ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా, వైద్యానికి బడ్జెట్లో 40 శాతం ప్రత్యేక నిధులు కేటాయించి సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
విద్యా, వైద్యం అనే నినాదంతో తీన్మార్ మల్లన్న టీం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 6500 కిలో మీటర్ల పాదయాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు విద్యా, వైద్యానికి 40 శాతం నిధులు కేటాయించడంపై వైఖరిని ఆగస్టు 28వ తేదీ లోపు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న జిల్లా టీం సభ్యులు మార్త శ్రీనివాస్,పోరిక సునీల్, తోట అనిల్, మామిడి ప్రభాకర్, అజ్మీరా అశోక్, భూక్యా సునీల్, శరత్, రాజు తదితరులు పాల్గొన్నారు.