తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయని, అందుకే అభివృద్ధి కార్యక్రమాల పేరిట సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సిద్దాంత బలం లేదని, ఒక ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీ అన్నారు. ఈ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ లాంటి వారిని పట్టించుకోని పార్టీ టిఆర్ఎస్ అని తెలిపారు.
బిహార్, పంజాబ్ రాష్ట్రాలలో రైతులకు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరన్నారు. తెలంగాణలో సీఎం కెసిఆర్ గొప్పగా చేసిందేమి లేదన్నారు. కేవలం మునుగోడు ఎన్నికకే కమ్యూనిస్టుల మద్దతు, వంద మంది నాయకులు, ఐదువందల కోట్లు ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితి లేదని, అలాంటిది కేంద్రంలో గెలుస్తామనుకోవడం ఊహ మాత్రమేనని ఎద్దేవా చేశారు.
అకస్మాత్తుగా ఫాంహౌస్ నుండి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, అభివృద్ది కార్యక్రమాలు, మెట్రో పనులు, నూతన సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి హుటాహుటిన కార్యచరణ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు.
త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కూడా కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బాల్ రాజు, జిల్లా ఇంచార్జులు సురేష్ గౌడ్, సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, మహిళా కన్వీనర్ వసంత, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.