తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి కూడా ఒకే ఒక లోటు స్పష్టంగా కనిపించేది. టిఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు, రెండో సారి అధికారంలోకి వచ్చినపుడు ఇప్పటి వరకూ కూడా ఒక మహిళను మంత్రిని చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఇదే అంశాన్ని ఆసరాగా తీసుకుని ఒక మహిళా నాయకురాలిని ఏకంగా రాష్ట్ర గవర్నర్ గా నియమించడం రాష్ట్ర బిజెపి నాయకత్వానికి ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్నది. తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా పార్టీకి అంకిత భావంతో పని చేసే డాక్టర్ తమిలిసై సుందరరాజన్ గవర్నర్ గా సేవలు అందిస్తూనే తమకు కూడా మార్గదర్శనం చేస్తుందని తెలంగాణ బిజెపి నాయకులు భావిస్తున్నారు. డాక్టర్ తమిలిసై సుందరరాజన్ గవర్నర్ గా వస్తుండటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని రాష్ట్ర బిజెపి నాయకులు అంటున్నారు. తెలంగాణ లో గణనీయమైన సీట్లు సాధించాలని ముందు నుంచే ప్లాన్ వేసుకుంటున్నకమలనాధులు ఈ విధమైన పావుకదుపుతారని టిఆర్ఎస్ నాయకత్వం ఊహించలేదు. దాంతో ఒక్క సారిగా టిఆర్ఎస్ నాయకులలో కలకల ఆరంభమైంది. ఇప్పటి వరకూ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న ఇ ఎస్ ఎల్ నర్సింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి మనస్ఫర్ధలు లేవు. మనరస్పర్ధలు మాట అటుంచి ఇరువురు ఎంతో కలిసి మెలిసి పని చేశారు. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ననేది వారి ఆందోళనగా కనిపిస్తున్నది. ఈ పాయింటే బిజెపి వారికి ఆనందం కలిగిస్తున్నది. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నాకూడా రాష్ట్ర గవర్నర్ తమ పట్ల మొగ్గు చూపడం లేదని అందువల్ల తాము ఏం చేయలేకపోతున్నామని వారిలో వారు మధన పడేవారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలకు సంబంధించి రాష్ట్ర బిజెపి నాయకులు వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకూ గవర్నర్ గా ఉన్న నర్సింహన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో వారు నేరుగా రాష్ట్రపతి వద్దకువెళ్లడం ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖను వివరణ కోరడం జరిగింది. ఇలాంటి అంశాలు చాలా ఉండటంతో రాష్ట్ర బిజెపి నాయకత్వం నిరుత్సాహానికి గురి అయింది. ఇప్పుడు వారిలో కొత్త ఆశలు రేగుతున్నాయి. కష్టపడి పని చేసే మనస్థత్వం ఉన్న తమిలిసై తెలంగాణ పై తన వంతు ముద్ర వేస్తారని బిజెపి నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోం శాఖ కలిసి పని చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని వారు అనుకుంటున్నారు.
previous post