ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు. గతంలో ఉన్న 9 పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీసు కమిషనరేట్లు రెండు నుంచి తొమ్మిదికి, నాలుగు పోలీసు జోన్లు ఏడుకి పెరిగాయని హోం మంత్రికి వివరించారు.
పోలీసు మల్టీ జోన్లు రెండు కొత్తగా ఏర్పాటయ్యాయని తెలిపారు. ఎస్పీలు, కమిషనర్లు, జోన్ ఐజీల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పారు.
సీనియర్ డ్యూటీ పోస్టులను 76 నుంచి 105కు పెంచాలని అమిత్షాకు విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ కీలక భేటీలో పలు అంశాలపై 10 లేఖలను ప్రధానికి అందజేసిన విషయం తెలిసిందే.