తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలు, స్వరాష్ట్రంలో పరిపాలనా విధానం, జరుగుతున్న ప్రగతి, ఇతర ముఖ్య పరిణామాలపై సిఎం పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రూపొందిన సవివరణమైన, సాధికారిక గ్రంథం ‘ఉజ్వల ప్రస్థానం’ ఆవిష్కరణ హైదరాబాద్ జూబ్లీ హాల్ లో జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయిత విజయ్ కుమార్ సన్నిహితుల మధ్య పుస్తకావిష్కరణ సభ జరిగింది. చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్ల ప్రభాకరరావు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎసీబీ డీజీ పూర్ణచందర్ రావు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎం చీఫ్ పీఆర్వో వనం జ్వాలా నరసింహారావు సభకు హాజరయ్యారు.
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సభకు సమన్వయ కర్తగా వ్యవహరించారు. తెలంగాణ చరిత్ర, వర్తమానం, భవిష్యత్ కార్యాచరణపై రూపొందించిన ఉజ్వల ప్రస్థానం పుస్తకం తొలికాపీని జెక్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఆవిష్కరించి ఘంటా చక్రపాణికి అందించారు. వివిధ పత్రికల్లో కొన్ని సంవత్సరాలుగా విజయ్ కుమార్ రాసిన వ్యాసాల సంకలనం బంగారు బాట అనే మరో పుస్తకం తొలికాపీని రాజీవ్ శర్మ ఆవిష్కరించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అందించారు. చారిత్రక పూర్వయుగం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన పరిణామ క్రమాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ రచయిత విజయ్ కుమార్ ఈ పుస్తకంలో వివరణాత్మకంగా పొందుపరిచారని సభకు హాజరైనవారు ప్రశంసించారు.
రానున్న తరాలకు తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలినాళ్లలో పాలనా సంస్కరణలకు ఈ పుస్తకం ఒక రెఫరెన్స్ గైడ్ లా ఉపయోగపడుతుందని చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పాలనను ఈ పుస్తక రూపంలో సామాన్యులకు అందుబాటులో తెచ్చారని ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ, ఆ తర్వాత పాలనలోనూ మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, రాజీ పడకుండా శ్రమ పడటంలోనే ఇలాంటి రచనలు సాధ్యం అయ్యాయి అన్నారు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.
పోటీ పరీక్షలు, ఉద్యోగార్థులకు ఈ రెండు పుస్తకాలు రెఫరెన్స్ గైడ్ లా ఉపయోగపడతాయని, వీటిని ఇంగ్లీషులోనూ తేవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చీఫ్ పీఆర్వో వనం జ్వాలా నరసింహారావు. ఎసీబీ డీజీ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీయార్ నేతృత్వంలో జరుగుతున్న అద్భుతమైన పాలనను సమాజంలో అందరికీ చేరువ చేసేలా పుస్తకాల రచన కొనసాగిందన్నారు.
సభలో పాల్గొన్న అధికారులు, ప్రముఖులు, హాజరమైన స్నేహితులు, సన్నిహితులకు రచయిత విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, కుటుంబం, సన్నిహితుల తోడ్పాటుతో తాను రచనలు చేయగలిగానని, తనను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
