భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిపిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా వెట్టిచాకిరీ విముక్తి జరగడమే కాకుండా లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం జరిగిందని సీ.పీ.ఐ.యం జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు అన్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల, చిన్న కాపర్తి గ్రామాలలో గురువారం నాడు సీ.పీ.ఐ.యం ఆధ్వర్యంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం రజాకారు మూకలు ఊర్లలో చేసే అరాచకాలను అడ్డుకొని దున్నే వాడిది భూమి అని నినదించినది కమ్యూనిస్టులు అన్నారు.
చిట్యాల మండలం గుండ్రాంపల్లితోపాటు, ఉరుమడ్ల, చిన్న కాపర్తి, వనిపాకల, తాళ్ళవెల్లంల గ్రామాలకు సాయుధ పోరాటం తో నేరుగా సంబంధాలు ఉన్నాయని, నాడు కమ్యూనిస్టు దళ కమాండర్ గా పని చేసిన గుత్తా సీతారాం రెడ్డిని రజాకారు మూకలు రాచకొండ గుట్టలలో కాల్చి చంపారని తెలిపారు. వారి పోరాటం వృధా కాలేదని అన్నారు.
స్వర్గీయ కామ్రేడ్ సీతారాం రెడ్డి తనయుడు, మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి మాట్లాడుతూ వారి పోరాట త్యాగ నిరతికి జ్ఞాపకంగా ఉరుమడ్ల లో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సాయుధ పోరాట అమరవీరుడు సీతారాం రెడ్డి మా నాన్న గారు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉన్నదని అన్నారు. ముందు గా చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పామనుగుల్ల అచ్చాలు, ఐతరాజు నర్సింహ, మోహన్ రెడ్డి తనయుడు గుత్తా సీతారాం రెడ్డి, రూపని రాములు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
చిన్న కాపర్తి గ్రామంలో అమరులు మామిడి బుగ్గయ్య, ఉప్పరగోని రామచంద్రం, రాపోలు వెంకటేశం, దేశపాక ఎల్లయ్య ల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉప్పరగోని స్వామి, గంగాపురం అంజయ్య,ముత్తి లింగం సీ.పీ.ఐ.యం నాయకులు మామిడి హన్మంతు, లోడె విఘ్ణమూర్తి, కొనేటి రాములు తదితరులు పాల్గొన్నారు.