కరోనా వారియర్స్ అంటూ ఆనాడు ఆకాశానికి ఎత్తిన ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల్ని విధుల నుంచి తొలగిస్తున్నది. గత సంవత్సరం నుండి కోవిడ్ సేవలు అందించిన తమను విధుల నుంచి తొలగించడం అన్యాయమని తొలగించిన A N Mలు సీఐటీయూ ఆధ్వర్యంలో నేడు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ మేరకు కలెక్టర్ కార్యాలయాధికారి శ్యామ్ కు, DM&HO కు వినతిపత్రం అందచేశారు. A NMలనే కాకుండా, సెక్యూరిటీ గార్డ్ లను శానిటేషన్ వర్కర్లను కూడా తొలగించారని ఇది సమంజసం కాదని సీఐటీయూ ములుగు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు.
కరోనా టైం లో కుటుంబాలను వదిలి పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదా అని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ ఖాళీలలో భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇలా తొలగించడం అన్యాయమని ఆయన అన్నారు.
ఇప్పటికైనా మానవతా దృక్పథం తో ఆలోచించి PHC లో వారిని సర్దుబాటు చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో A N M లు కవిత, మహేశ్వరి, అపర్ణ, సుజాత, సంజీవ రాణి, వసంత, రమ్య, శోభారాణి, అనూష, జేఏసీ నాయకులు ముంజల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.