కరోనా విజృంభిస్తున్నా మద్యం షాప్ లను రాత్రి 8 గంటల నుంచి 9.30 గంటల వరకు పెంచడం ప్రభుత్వ మూర్ఖపు చర్య అని టీపీసీపీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కరోనా తీవ్రంగా పెరుగుతున్న సమయంలో వైన్స్ షాపుల వేళలు ఇంకా తగ్గించాల్సింది పోయి పెంచడం ఏమిటని మల్లు రవి ప్రశ్నించారు.
రాష్ట్రంలో గుడంబా విస్తరిస్తున్న నేపధ్యంలో వైన్స్ షాపుల సమయాన్ని పెంచాలని నిర్ణయించామని ఆబ్కారీ శాఖ మంత్రి చెప్పడం వింతగా ఉందని తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. మద్యం షాపుల వేళలు పెంచి ప్రజలు ఇంకా ఎక్కువ సేపు మద్యం షాపుల వద్ద ఉండేలా చేస్తూ కరోనా విస్తరణకు ప్రభుత్వం పని చేస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత లేకుండా పని చేస్తుందని అన్నారు. ఒకవైపు వైద్య శాఖ కరోనాని అరికట్టాలంటే మరోసారి లక్డౌన్ చేయాలని సూచిస్తుంటే ప్రభుత్వం ఇలా వైన్స్ సమయాలు పెంచడం ఏమిటని, సాధ్యమైనంత తక్కువ సమయం తెరిచి ఎక్కువ సమయం మూసేలా చూడాలని ఆయన సూచించారు.