కరోనా వైరస్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున గురువారం కోటగిరి మండలం లోని పోతంగల్, కోటగిరి గ్రామంలలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి సోకకుండా ఉండాలంటే ప్రభుత్వ సూచనలను ప్రజలందరూ పాటించాలని, లాక్ డౌన్ కు అందరూ సహకరించాలని అన్నారు.
అందరూ ఇంట్లోనే ఉండి కరోనా ను అరికట్టేందుకు సర్కారు కు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా కరోనా వైరస్ 60 ఏండ్లు దాటిన ముసలి వాళ్లలో ఎక్కువ ప్రభావం చూపుతున్నందున వారే ఎక్కువగా చనిపోతున్నారని తెలిపారు.
చిన్న పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండదని వారికి కరోనా సోకకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా ఎవరూ బయట తిరగొద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు.
ప్రస్తుతం పంటలు చేతికొచ్చే సమయం గనుక రైతులు ఆగమవ్వొద్దని,తెలంగాణ లో రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొంచెం అటో ఇటో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు.
రైతులకు టోకెన్ ఇచ్చి ఆ టోకెన్ లో తెలిపిన తేదీ రోజు వారి వద్దకు వచ్చి ప్రభుత్వం ధాన్యం కొంటుందని అన్నారు. వ్యవసాయ పనులు చేసేటప్పుడు రైతులు సామాజిక దూరం పాటించాలని అన్నారు. కరోనా ను అంత ఈజీగా తీసుకోవద్దని ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం అయిన అమెరికా లోనే అజాగ్రత్త వల్ల పరిస్థితి చేయిజారి పోయిందని అన్నారు. కనుక మరో రెండు వారాలు అందరూ ఇండ్లకే పరిమితమవ్వాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.