ఈ ఫోటో ఉన్నది ఎవరు? ఎవరో కరోనా డ్యూటీలో ఉన్న డాక్టర్ లేదా నర్సు అయి ఉంటారు. అంతే కదా? అలా అనుకుంటే మీరు పొరబాటు పడ్డట్టే. కొంచెం జూమ్ చేసి దగ్గరగా చూడండి. ఆమె ఎవరో తెలుస్తుంది. ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్.
వృత్తి రిత్యా డాక్టర్ అయిన తమిళసై సౌందర రాజన్ రాజకీయాలలో వచ్చి తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేశారు. పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి తమిళ రాజకీయాలలో తనదైన శైలిలో ముందుకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన నాటి నుంచి ఎంతో క్రియాశీలంగా వ్యవహరిస్తూ తన వంతు కర్తవ్యాన్ని ఆమె నిర్వరిస్తున్నారు.
కరోనా విపత్తు వచ్చిన నాటి నుంచి రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలను ఆమె మరింత ఎక్కువ చేయించారు. ప్రత్యక్షంగా బాధితులను ఆదుకోవడానికి ఆమె చూపిన చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు. తాజాగా ఆమె నిమ్స్ ఆసుపత్రిలోని కరోనా బ్లాక్ ను సందర్శించారు. డాక్టర్ డ్రస్ వేసుకుని నిమ్స్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి పని చేశారు.
డాక్టర్లు, నర్సులు పారిశుద్ధ్య పనివారికి నైతిక స్థయిర్యాన్ని కల్పించే విధంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రవర్తించడం అందరిని ఆశ్చర్య పరిచింది. కరోనా రోగులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించేందుకు వెళ్లిన ఏకైక గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఒక్కరే.