తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కు కడప విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ గౌరవ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి రాష్ట్రానికి బయలుదేరిన గవర్నర్ బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాదు నుంచి పుదుచ్చేరి రాష్ట్రానికి వెళ్లడానికి మార్గమధ్యంలో హెలికాప్టర్లో ఇంధనం నింపుకోవడానికి కడప ఎయిర్పోర్ట్ కు వచ్చారు.
కడప విమానాశ్రయంలో గవర్నర్ కు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో 10 నిమిషాల పాటు గవర్నర్ విశ్రాంతి తీసుకున్నారు. హెలికాప్టర్ కు ఇంధనం నింపుకున్న అనంతరం సాయంత్రం 4.30 గంటలకు పుదుచ్చేరి బయలుదేరి వెళ్లారు.
ఈ నెల 18న గురువారం పుదుచ్చేరి గవర్నర్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్, ఎయిర్పోర్ట్ అధికారి జాఫర్, విమానాశ్రయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.