తెలంగాణాలో ఒక పక్క కరోనా మహమ్మారి తో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ప్రభుత్వం ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటుందని పబ్బులు, మద్యం దుకాణాలే ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయా అసలు ఈ విషయమై సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందా? లేక కోర్టే ఆదేశాలు ఇవ్వాలా? అని తెలంగాణ హై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది .
సోమవారం కరోనా విజృంభణపై విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడిలో విఫలమయ్యారని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. రాష్ట్రం లో కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జన సంచారాన్ని తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది.
అధికంగా జనాలు ఉండే సినిమా థియేటర్లతో పాటు పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. రాష్ట్ర సర్కారు తమకు సమర్పించిన నివేదికలో కనీస వివరాలు కూడా ఉండడం లేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం నియంత్రణకు సర్కారు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని న్యాయస్థానానికి ఏజీ చెప్పారు.
దీంతో హైకోర్టు స్పందిస్తూ ఓ పక్క ప్రజల ప్రాణాలు గాల్లో తేలియాడుతున్నాయని, ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించింది. పబ్బులు, మద్యం దుకాణాలే ప్రభుత్వానికి ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది.అసలు సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందా? లేక కోర్టే ఆదేశాలు ఇవ్వాలా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్కారు నిర్ణయాలను మధ్యాహ్నంలోగా సమర్పించాలని, భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని తెలిపింది.మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.