దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని రాష్ర్ట మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని రెహ్మత్నగర్లో గల సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్లు బాల్క సుమన్,గువ్వల బాలరాజు,ఎమ్మెల్సీ ప్రభాకర్,ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,కాలె యాదయ్య, మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సెంటర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్లు చెప్పారు.
సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వారికి ఈ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు.ఇలాంటి అద్భుతమైన సెంటర్ను అందించిన సీఎం కేసీఆర్కు దళిత వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. దళిత వర్గాలకు సంబంధించి హైదరాబాద్ మహా నగరంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ నిర్మించడం అద్భుతమైన విషయమన్నారు. నిరంతరం దళితులపై అధ్యయనం చేసే విధంగా దళితుల కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించడం ద్వారా వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపొచ్చనే సంకల్పంతో స్టడి సర్కిల్ నిర్మాణం జరుగుతోందన్నారు.
దళిత వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అధ్యయనాలకు ఈ సెంటర్ కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. దళితుల జీవన విధానంతో కూడిన దృశ్యాలతో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
భవిష్యత్లో ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు తెలంగాణలో దళితుల కోసం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించే విధంగానూ ఈ సెంటర్ తోడ్పడుతుందని పేర్కొన్నారు.