గుజరాత్ గాంధీనగర్ లో జరిగిన భాగస్వామ్య సదస్సు లో (COP – 13) తెలంగాణ అటవీ శాఖ పాల్గొంది. వన్యప్రాణులు, వలస జాతుల సంరక్షణపై అంతర్జాతీయ కాప్ సదస్సు ఈనెల 17 నుంచి 22 దాకా గాంధీ నగర్ లో జరిగింది. 130 దేశాలకు చెందిన సుమారు 3,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
తెలంగాణ అటవీ శాఖ ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తీసుకున్న పర్యావరణ సంరక్షణ చర్యలు అలాగే అటవీశాఖ వినూత్న ప్రయత్నాలను అంతర్జాతీయ వేదికపై వివరించింది. అంతరించిపోతున్న మూషిక జింకలు (మౌజ్ డీర్) ప్రత్యేకంగా నెహ్రు జూ పార్క్ వేదికగా పునరుత్పత్తి చేపట్టడం వాటి సంరక్షణ తో పాటు మళ్ళీ అటవీ ప్రాంతాల్లో విడుదల చేసిన చర్యలను అటవీశాఖ వివరించింది.
అలాగే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా సంరక్షిస్తూ ఉన్న రాబందుల కేంద్రం ప్రత్యేకతను ఈ సమావేశాల్లో అటవీశాఖ వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో జీవవైవిధ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలు ప్రత్యేకంగా అమలు చేస్తున్నఅటవీ సంరక్షణ విధానాలతో పాటు వివిధ కార్యక్రమాలను ఈ వేదికగా తెలంగాణ అటవీ శాఖ వివరించింది.
దేశీయంగా అంతర్జాతీయంగా అత్యంత విజయవంతంగా అమలు చేస్తున్న అటవీశాఖ కార్యక్రమాలు 73 ఈ వేదికపై ప్రదర్శించగా తెలంగాణకు చెందిన మూషిక జింకల పునరుద్ధరణ కూడా ఈ అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకుంది. తెలంగాణ అటవీ శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాల్ ను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, జాతీయ అంతర్జాతీయ డెలిగేట్లు సందర్శించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో తెలంగాణ అటవీ శాఖ తరఫున పి సి సి ఎఫ్ ఆర్ శోభ అదనపు పి సి సి ఎఫ్ సి సిద్ధానంద్ కుక్రేటీ, నెహ్రు జూ పార్క్ డైరెక్టర్ క్షితిజ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.