సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 8 ఏళ్లలో ధాన్యం సేకరణ ద్వారా రాష్ట్ర రైతాంగానికి రూ. 1 కోటి 21 లక్షల కోట్లను ధాన్యం సేకరణ ద్వారా అందజేసామన్నారు. యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెం1గా ఉందని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఎఫ్.సి.ఐ ఉన్నతాధికారులు, కంటైనర్ కార్పోరేషన్ ఈడి, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఏంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నేడు మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైతుబందు, 24గంటల ఉచిత కరెంటు, ఎంఎస్పీతో ధాన్యం సేకరణ తదితర రైతు అనుకూల విధానాలతో దేశంలోనే యాసంగి ధాన్యం సేకరణలో మొదటిస్థాయిలో నిలిచామని మంత్రి తెలిపారు. అదే స్పూర్తిని కొనసాగిస్తూ రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు సమాయాత్తమవ్వాలని అధికారులకు సూచించారు. కరోనా సంక్షోభంలోనూ 92 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతూనే విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియోటాగింగ్, ట్రాన్స్ పోర్టు, మిల్లర్ల అనుసందానం, గన్నీలు, ప్యాడీక్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు తదితర అన్ని వనరులను సంపూర్ణంగా సిద్దం చేసుకోవాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతోనూ గన్నీల తరలింపుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఉన్నతాధికారులతో అన్ని అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించిన మంత్రి గంగుల, అకాల వర్షాలకు అనుగుణంగా కొనుగోలు ఏర్పాట్లు చేసేలా సమగ్ర యాక్షన్ ప్లాన్ని రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతామని సూచించారు. సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన సేవల్ని పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఐవీఆర్ఎస్ నెంబర్ 799712345ను మంత్రి గంగుల ప్రారంభించారు.
వీటి ద్వారా కొత్త ఎప్.ఎస్.సి కార్డుల సమస్యలు, పోర్టబులిటీ వీలు కలుగుతుంది. ఈ అప్లికేషన్ రూపకల్పనలో క్రుషి చేసిన ఎన్.ఐ.సి ఉద్యోగులను అభినందించి మెరిట్ సర్టిఫికెట్లను మంత్రి గంగుల కమలాకర్ ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల కమిషనర్ వి. అనిల్ కుమార్, ఎప్.సి.ఐ డీజీఎం కిరణ్ కుమార్, కంక్వేర్ ఈడీ జి.ఆర్. శేషగిరి రావ్, అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, పౌరసరఫరాల జీఎంలు, డిసీఎస్వోలు, డీఎంలు పాల్గొన్నారు.