తెలంగాణ దీరవనిత, మహిళా లోకానికి స్ఫూర్తిగా చాకలి ఐలమ్మ నిలిచిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి సోమవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గోవర్ధన్ మాట్లాడుతూ.. బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా చాకలి ఐలమ్మ నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసి సంక్షేమ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ, రజక సంఘం ప్రతినిధులు రాజయ్య, సంగయ్య, అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
ఆర్థిక పరిస్థితి బాగాలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కామారెడ్డి నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు 16 లక్షల 34 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1571 మందికి 9 కోట్ల 73 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగిందన్నారు.