తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైన, టీడీపీ నేతలపైన వైస్సార్సీపీ అల్లరి మూకల దాడికి నిరసనగా బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కాట్రగడ్డ ప్రసూన మీడియాతో మాట్లాడుతూ.. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. ప్రభుత్వం, పోలీసులు కలసిచేసిన ఉగ్రవాదమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఏముంటాయి..? కేంద్రం తక్షణమే స్పందించి విభజన చట్టంలో పేర్కొన్న శాంతి భద్రతల అంశాలపై ఉన్న అధికారం ప్రయోగించి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్ ని మరో బీహార్ తరహా రాష్ట్రం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆమె సూచించారు.
దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. ఏకపక్షంగా కార్యాలయాలు, విద్యాలయాలు మూసేసి నిరసన తెలిపినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో కడపలో, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరుల్లోనూ పార్టీ కార్యాలయంపైన, నాయకుల ఇంటిపై దాడులు జరిగాయంటే పోలీసు వ్యవస్థ, ఇంటిలిజెన్స్ వైఫల్యం కాదా… అని ఆమె ప్రశ్నించారు.
డిజిపి పదవికే మచ్చ తెచ్చిన వ్యక్తి గౌతమ్ సవాంగ్
శాంతిభద్రతల రక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే ఏం కావాలని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ చేయించాలని ఆమె డిమాండు చేశారు. తెదేపా కార్యాలయంపై దాడి జరుగుతుంటే డీజీపీకి తెలియలేదంటే ఆయన ఆ పదవికి తగినవారేనా..అని వ్యాఖ్యానించారు. సంయమనం పాటించాలంటూ డీజీపీ తెలివిగా మాట్లాడుతున్నారు. అదే మాట వైసీపీ వాళ్లకు చెప్పోచ్చు కదా అని సూచించారు.
కొందరి కారణంగా పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది. పోలీసులే మాకెందుకీ ఖర్మ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అడ్డు వస్తే గృహనిర్బంధాలు చేస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని పేర్కొన్నారు. ఇటువంటి దారుణమైన ఘటన జరుగుతున్న కేంద్రం మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇది సరైన విధానం కాదు.. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం స్పందించకుంటే ప్రతి రాష్టంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే స్పందించి ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలపై పోరాడేది రాజకీయ పార్టీలేనని, వాటి కార్యాలయాలపైన, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులను చేయాలనుకుంటున్నారని కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెదేపా సమస్య కాదు. 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే. లేదంటే ముఖ్యమంత్రి ఇల్లు, డీజీపీ కార్యాలయమున్న ప్రాంతానికి 100 గజాల దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై కర్రలు, సుత్తులతో వచ్చి దాడి చేస్తారా.. అని ప్రశ్నించారు.
రౌడీమూకలకు మద్యం తాగించి వారితో వచ్చి దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది డీజీపీ, ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగింది కాదు. ఇద్దరూ లాలూచీ పడి పథకం ప్రకారమే ఒకే సమయంలో రాష్ట్రంలో పలుచోట్ల దాడి చేయించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కోసమే అన్ని వేధింపులను సహించాం. అయినా భయపడలేదని వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.