అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి సత్వర చికిత్స అందించేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా టెలీ మెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ట్రఎక్సైజ్,సాంస్కృతిక,క్రీడా, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెలీ మెడిసిన్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు ఏదైనా జబ్బుతో బాధపడుతుంటే టెలీ మెడిసిన్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 08542- 2 26670 కు ఫోన్ చేసి వారి సమస్యను తెలియచేస్తే తక్షణమే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా గాని లేదా ప్రైవేట్ డాక్టర్ ద్వారా గాని చికిత్స అందిస్తారు.
టెలిఫోన్ లో డాక్టర్ ను సంప్రదించిన తర్వాత డాక్టర్ మందులు సూచిస్తారని ,ఆ తర్వాత రోగి మళ్ళీ టెలిమెడిసిన్ కంట్రోల్ రూమ్ కు సంప్రదిస్తే కంట్రోల్ రూమ్ లో ఉన్న సిబ్బంది తిరిగి సంబంధిత డాక్టర్ రాసిన మందులను ఫార్మసిస్ట్ ద్వారా అనుమతి తీసుకుని దగ్గరలోఉన్న ఫార్మసీ స్టోర్లను సంప్రదించి అవసరమైన మందులను రోగి ఇంటి వద్దనే డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు.
ఈ టెలీ మెడిసిన్ విధానం ద్వారా రోగులకు వైద్య సేవలు అందించేందుకు గాను జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన 26 మంది డాక్టర్లు, అలాగే 43 మంది ప్రైవేటు డాక్టర్లు, 210 మంది ఏఎన్ఎం లను టెలిమెడిసిన్ కు అనుసంధానించామని తెలిపారు.
అంతేకాక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ వద్ద 24 గంటలు అందుబాటులో ఉండేలా అత్యవసర పరిస్థితులలో రోగులను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియుఎస్ వి.ఎస్ లకు తరలించేందుకు 2 అంబులెన్సు లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ వెంకట రావు మాట్లాడుతూ టెలి మెడిసిన్ ద్వారాడాక్టర్ తో మాట్లాడటమే కాకుండా,ఇంటికే మందులు పంపించే ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ఎస్ పి రేమో రాజేశ్వరి మాట్లాడుతూ కరోనా లాక్ డాన్ పీరియడ్లో టెలి మెడిసిన్ విధనం జిల్లాకు బాగా ఉపయోగ పడుతుందిని అన్నారు.
టెలీ మెడిసిన్ విజయవంతంగా నడిచేందుకు పోలీస్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ శామ్యూల్ లక్ష రూపాయల చెక్కును పోలీసుల సంక్షేమం కోసం ఎస్ పి కి అందజేశారు. ఐ ఎం ఏ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ ఐ ఎం ఏ తరఫున ప్రత్యేక డాక్టర్ల సేవలను ఇవ్వటమే కాకుండా మూడు అంబులెన్సులను ఇస్తున్నామని, లాక్ డౌన్ పీరియడ్ లో ప్రైవేట్ డాక్టర్లు ఉచితంగా సేవలందించేందుకు సిద్ధమని ప్రకటించారు.