టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపిలో సంచలన టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మధ్యలో పెరిగిన రాజకీయ విభేదాలు టెలిఫోన్ ట్యాపింగ్ కు దారితీశాయి.
ఒక పార్లమెంటు సభ్యుడు ఒకరు అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వ్యక్తిగత ఫోన్ కాల్ డేటాను పోలీసు ఉన్నతాధికారుల సహాయంతో సేకరించాడు. ఈ విషయం సదరు ఎమ్మెల్యేకు తెలిసింది. దీంతో ఆ ఎమ్మెల్యే జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.
పార్లమెంటు సభ్యుడికి ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పార్లమెంటు సభ్యుడిని సదరు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోకి రానివ్వడం లేదు. పార్లమెంటు సభ్యుడు ముందుగా తన అనుమతి తీసుకోకుండా వచ్చాడని ఒక సారి ఎమ్మెల్యే మనుషులు ఎంపిపై దాడి కూడా చేశారు.
ఆ స్థాయిలో పోరాటం జరుగుతున్న సమయంలో పార్లమెంటు సభ్యుడు సదరు ఎమ్మెల్యే టెలిఫోన్ ను ట్యాపింగ్ చేయించడం ఆసక్తికరంగా మారింది. సదరు ఎమ్మెల్యే పార్లమెంటు సభ్యుడిని తీవ్రంగా అవమానిస్తున్నారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి.
ఎంపి అయినా ఎవడైనా నా నియోజకవర్గంలోకి రావాలంటే నా పర్మిషన్ ఉండాల్సిందేనని ఎమ్మెల్యే చెప్పడం కూడా వివాదాలను పెద్దది చేసింది. ఈ నేపథ్యంలో టెలిఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకున్నది.