గత వారం రోజుల నుండి ఎండలు దంచి కొడుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత వారం రోజుల నుండి భానుడి ప్రతాపంతో వృద్ధులు పిల్లలే గాక యువకులు సైతం ఎండ తాపానికి తల్లడిల్లుతున్నారు. బానుడు భగభగకు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే చాలావరకు సాహలిసించలేకపోతున్నారు. గతంలో త్రాగడానికి నీటిని చలివేంద్రాల ద్వారా ఉచితంగా అందజేసేవారు. కాగా గత రెండు సంవత్సరాల నుండి కల్వకుర్తి పట్టణంలో మానవత్వం నశించిందా అన్న చందంగా పట్టణంలో ఎక్కడ కూడా చలివేంద్రాలు కనిపించడం లేదు. పక్క గ్రామాల నుండి వచ్చి వెళ్లే వారికి స్థానికులకు ఉపశమనముగా కుండలనీరు అందించే సేవా కేంద్రాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక లీటరు నీటిని 20 నుంచి 25 రూపాయల పెట్టి కొనాల్సి వస్తుందని స్థానికులు పల్లెవాసులు బోరు మంటున్నారు.
మహిళలను చూస్తే గుండె తరుక్కుపోతుంది. చిన్న పిల్లలను చంకలో వేసుకొని ఎండ తాపానికి నీరు దొరకక 20 రూపాయలు చేతపట్టుకుని షాపు షాపు వెతుక్కుంటూ వెళ్లిన సంఘటనలు కంటనీరు పెట్టిస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం కంటనీరు పెట్టిస్తున్న కాలాన్ని ఈ తరం చూస్తుందనుకోలేదని, రానున్న రోజుల్లో నీటి యుద్ధాలు చూస్తామని పత్రికల్లో వార్తల్లో కథలను వింటున్నామని అవి జరుగుతాయా అని తమను తామే ప్రశ్నించుకునేవారమని ఈ స్థితిని చూస్తే ఖచ్చితంగా నీటి యుద్ధాలు జరగడం ఖాయమని వృద్ధులు చర్చించుకుంటున్నారు.
తాగటానికి నీరు అందించని నాయకులు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతారని ఎండాకాలంలో బాటసారులకు కనీసం త్రాగడానికి నీరు అందించని సేవ చేయలేని నాయకులు మనకు అవసరమా అంటూ పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. పిట్టలకు, పక్షులకు గిన్నెలో నీటిని పోసి ఆరుబయటన పెట్టాలని వాటి ప్రాణాలను కాపాడాలని సూక్తులు చెప్తారు కానీ కనీసం చిన్న పిల్లలు మహిళలకు త్రాగడానికి నీరు అందించలేక పోతున్న వ్యవస్థను చూసి అసయం వేస్తుందని పట్టణ వాసులు మాట్లాడుకుంటున్నారు.
భానుడి ప్రతాపం ఇంకా 20 రోజుల పైనే ఉండగా కనీసం ఇప్పటికైనా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు నాయకులు ముందుకు రావాలని బాటసారులు వేడుకుంటున్నారు.