ఈసీఐఎల్ లోని సహస్ర లింగేశ్వర స్వామి ఆలయ రేనవేషన్ కమిటీ పేరుతో టిఆర్ఎస్ కార్యకర్తలకు పునరావాసం కల్పించారని డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కుషాయిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పునర్ నిర్మాణం పేరుతో వేసిన కమిటీకి ప్రమాణ స్వీకారం ఉండదని దేవాదాయశాఖ అధికారులే చెబుతున్నప్పటికీ ప్రమాణస్వీకారం పేరుతో ఫ్లెక్సీలు వేసుకోవడంలో అర్థం లేదన్నారు. ఈ కమిటీలో ఆలయ వ్యవస్థాపకులకు, కాలనీవాసులకు, భక్తులకు స్థానం కల్పించకుండా కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే స్థానం కల్పించారని ఆమె అన్నారు. ఆలయంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులతో రేనవేషన్ పేరుతో వేసిన కమిటీ సభ్యులు ఆలయం పై పెత్తనం చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకుని రేనవేషన్ కమిటీ చర్యలను కట్టడి చేయాలని ఆమె కోరారు. ఇదిలా ఉండగా ఆలయ రేనవేషన్ కమిటీపై దేవాదాయశాఖకు పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి