అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలో ఇళ్ల తొలగింపు ప్రక్రియలో అధికారుల అత్సుత్సాహం ఒక బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
అది ఒక ముంపు గ్రామం కావడంతో ప్రభుత్వం పరిహారం ఇస్తే ఖాళీ చేద్దామని గ్రామస్థులు నిరీక్షిస్తున్నారు. అయితే అధికారులు న్యాయం చేస్తామని నోటిమాట చెప్పి అలా చేయకుండా ఇళ్లు కూలగొట్టేందుకు జేసీబీలను రంగంలోకి దించారు.
ఇళ్ల కూల్చివేత మొదలు పెట్టడంతో ఒక బాలుడు గాయపడ్డాడు. కూల్చివేతలో ప్రభుత్వ తీరును తెలుగుదేశం తప్పుబట్టింది. బతికుండగానే మనుషుల్ని సమాధి చేసే క్రూరమైన ఆలోచనలు వైకాపా సర్కార్కు ఎలా వస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిలదీశారు.
ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని, మనుషులు ఉండగానే ఇళ్లను కూల్చడాన్ని ఏమనాలని ట్విట్టర్లో ప్రశ్నించారు. బాధితులను మాజీ మంత్రి పరిటాల సునీత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించడం సరికాదన్నారు. మర్రిమాకులపల్లిలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.