తిరుమలలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.
తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు.
ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా మార్చి 24, 25వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్ సేవ), మార్చి 26, 27, 28వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ (వర్చువల్ సేవలు)లను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.