బస్ స్టాండ్ నుండి ప్రయాణికులతో కూడిన ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించి తీసుకు వెళ్లిన ఘటన ఇది.మార్గమధ్యంలో లారీకి ఢీకొట్టి అక్కడే వదిలేసి దొంగా పరారు కాగా బస్సు తిరిగి డిపోనకు తెచ్చుకునున్నారు ఆర్టీసీ అధికారులు. పట్టణ సీఐ రవికుమార్ తెలిపిన కథనం ప్రకారం తాండూరు డిపోనకు చెందిన(ఏపీ21జడ్437) బస్సు ఆదివారం రాత్రి కరణ్కోట్ నైట్హాల్ట్ బయల్దేరడానికి ప్రయాణ ప్రాంగణంలో నిలిపి ఉంది.
డ్రైవర్ ఇలియాస్, కండక్టర్ జగదీశ్ భోజనానికి వెళ్లారు. అప్పటికే కరణ్కోట్, ఓగీపూరు గ్రామాల ప్రయాణికులు బస్సు లో కూర్చున్నారు. అంతలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బస్సును స్టార్ట్ చేశాడు. కండక్టర్ రాకుండానే ఎలా తీసుకెళ్తావని కొందరు ప్రయాణికులు అతన్ని ప్రశ్నించారు. ‘బస్సుకు నేనే డ్రైవర్ నేనే కండక్టర్’ అంటూ దురుసుగా మాట్లాడి ప్రాంగణంలో నుంచి తీసుకెళ్లాడు. అతను మద్యం తాగి ఉన్నట్లు ప్రయాణికులు గుర్తించారు.
పట్టణంలోని మల్లప్పమడిగ వద్దకు వెళ్లగానే ముందు వెళ్తున్న ఓ లారీని ఢీకొట్టాడు. నడిరోడ్డు మీదే బస్సును వదిలేసి అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రయాణికులు డిపో మేనేజర్ రాజశేఖర్కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. బస్సు తిరిగి డిపోనకు తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రవికుమార్ వివరించారు.