తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎంఎల్ఏ రేగా కాంతరావు తో కలిసి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు, స్థిరీకరణ, నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద కొంత ఆయకట్టుకు నీటి సరఫరా, 6.74 లక్షల ఎకరాలకు నీరందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అని దీన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది అని ఆరోపించారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, జలసంఘం నుంచి సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు పొందింది అని ఇదే సమయంలో మొదట సీతారామ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి లభించగా, తర్వాత తిరిగి సీతమ్మసాగర్ను కూడా కలిపి దరఖాస్తు చేయమని కేంద్రం సూచించడం ఏంటని ప్రశ్నించారు. ఇది దుర్మార్గమైన చర్య అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని, సీతారామ ప్రాజెక్టు పనుల అనుమతులను కేంద్ర ప్రభుత్వం మళ్లీ అనుమతులు కోరడం కక్ష్య పూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ఏజెన్సీల ప్రాంతాల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనే సాధ్యమని పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపారన్నారు. పినపాక నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధికి సీఎం రూ.100 కోట్లను కేటాయించారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం డీఎంఎఫ్ నిధులు రూ.46 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. డీఎంఎఫ్ నిధుల నుండి మణుగూరు డిగ్రీ కాలేజీ అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.2.50 కోట్లు, మణుగూరు బస్ డిపో ఎదురుగా బస్టాండ్ నిర్మాణానికి రూ.4 కోట్లు, అశ్వాపురం మెయిన్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ కోసం రూ.4 కోట్లు, మొడికుంట డ్రైన్ నిర్మాణం కోసం 1.50 కోట్ల నిధులను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. తెరాస పార్టీ తెలంగాణ ప్రజల పుట్టినిల్లు వంటిదని రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.