అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏపీలో ని విజయనగరం జిల్లా పోలీసు శాఖ అధికారులు కొద్ది సేపు మౌనం పాటించారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఆర్మ్డ్ రిజర్వు అదనపు ఎస్పీ ఎం.ఎం.సోల్మన్ అన్నారు.
అమరజీవి శ పొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో డీపీఓలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మ్ రిజర్వు అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి, పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆర్మ్ రిజర్వు అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను అర్పించి, అమరజీవిగా నిలిచిన
మహానీయుడు శ్రీ పొట్టి శ్రీరాములన్నారు. మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన ఘనత శ్రీరాములదన్నారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీ వెంట నడిచి, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని, జైలుశిక్ష అనుభవించారన్నారు. కుల, మతాల పట్టింపులు లేకుండా వ్యవహరించి,హరిజనులను దేవాలయంలోకి అనుమతించాలని నిరాహార దీక్ష చేపట్టారన్నారు. శ్రీరాములు నిరాహార దీక్షతో అప్పటి మద్రాసు ప్రభుత్వ హరిజనులను దేవాలయంలోకి అనుమతిస్తూ శాసనాలు చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాముల త్యాగాలను గుర్తిస్తూ నెల్లూరుజిల్లాకు 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసా రన్నారు. అటువంటి మహానీయుడ్ని ఆయన వర్ధంతి రోజున స్మరించుకోవడం, నివాళులు అర్పించడం తెలుగువారి బాధ్యతని అదనపు ఎస్పీ ఎం.ఎం. సోల్మన్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, డిపిఓ ఎఓ వెంకట రమణ, న్యాయ సలహాదారులు వై.పరశురాం, కార్యాలయ పర్యవేక్షకులు ప్రభాకర రావు, ఆర్ఎస్ఎస్ఐలు నీలిమ, కేశవరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పాలు సమర్పించి, మౌనంపాటించి, నివాళులు అర్పించారు.