మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ వైరాగ్యంపై వైసీపీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బందరు పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే పేర్ని నాని తన రాజకీయ వైరాగ్యాన్ని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి వర్గ పునర్ నిర్మాణం సందర్భంగా పేర్ని నానికి మంత్రి పదవి పోయింది.
మంత్రి పదవి పోయిన నాటి నుంచి కూడా వైసీపీ అగ్ర నేతలతో ఆయన కలివిడిగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలలోనూ, ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించడంలోనూ కూడా ఆయన చురుకుగానే వ్యవహరిస్తున్నారు. పేర్ని నానికి వచ్చే ఎన్నికలలో టిక్కెట్ సమస్య కూడా ఉండదు.
అలాంటిది ఆయన ఒక్క సారిగా, అదీ కూడా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే తన రాజకీయ వైరాగ్యాన్ని ఎందుకు ప్రదర్శించారు? రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం లేకనా అనే చర్చ ప్రారంభం అయింది. తన కుటుంబ సమస్యల కారణంగా ఆయన చాలా కాలంలో తన కుమారుడు కిట్టు ఎలియాస్ పేర్ని కృష్ణమూర్తికి టిక్కెట్ ఇవ్వాలని చాలా కాలంగా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని కోరుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కూడా చెప్పారు.
అయితే రాజకీయ వారసులకు సీట్లు ఇచ్చేది లేదని పేర్ని నానికి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి కూడా ముఖ్య మంత్రి జగన్ తెగేసి చెప్పారు. అయినా పేర్ని నాని తన ప్రయత్నాలను వదలలేదు. తన వ్యక్తి గత జీవితం ఇక పై సాఫీగా సాగాలంటే తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోక తప్పని సరి పరిస్థితిలో పేర్నొ నాని ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోలేక పోతే అది ఆయన వ్యక్తిగత జీవితంపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తన వ్యక్తిగత విషయాలతో బాటు స్థానికంగా ఎంపి బాలశౌరితో పేర్ని నానికి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో బాలశౌరిని ఓడించి తీరుతామని కూడా పేర్ని నాని అనుచరులు ప్రకటిస్తున్నారు. బాలశౌరి పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. ఒక వైపు బాలశౌరిని ఎదుర్కొంటూ మరో వైపు తన అనుచరులకు సర్ది చెప్పుకుంటూ ఇంకో వైపు తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాల్సి రావడం పేర్ని నానికి తీవ్ర వత్తిడి తెచ్చి పెడుతున్నది.
ఈ కారణంగానే ఆయన ముఖ్యమంత్రి సమక్షంలోనే తన రాజకీయ వైరాగ్యాన్ని ప్రదర్శించినట్లు చెబుతున్నారు. తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లు రవీంద్రకు జనాదరణ క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో తాను గెలవడం కూడా కష్టంగా మారుతుందని పేర్ని నాని ఒక అంచనాకు వచ్చారు.
ఇలా పార్టీలోని అంతర్గత సమస్యలతో బాటు కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు కూడా పేర్ని నానికి చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారని అంటున్నారు. పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుకు అధిష్టానం ఈ సారి ఎన్నికలలో టిక్కెట్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.