24.7 C
Hyderabad
March 29, 2024 07: 22 AM
Slider ముఖ్యంశాలు

అబద్దాలు చెప్పిన మంత్రిని బర్తరఫ్ చేయాలి

the minister who lied should be sacked

గిరిజన రిజర్వేషన్ల అంశంపై  పార్ల‌మెంట్‌ను  త‌ప్పుదోవ ప‌ట్టించిన మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలని లోక్ సభలో టీఆర్ఎస్  ఎం‌పి లు డిమాండ్ చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఆరోపించారు. లోక్ సభ నుంచి టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి తమ నిరనసను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తాము కేంద్రానికి 2017లో ప్రతిపాదనలను పంపినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే దానిని పక్కనపెట్టిందని ఆరోపించారు. అసెంబ్లీ తీర్మానం తమకు పంపలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు సభను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఆయన గిరిజనులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి వర్గం నుంచి బిశ్వేశ్వర్ తుడు ను బర్త్ రఫ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచాలని టీఆర్ఎస్ పట్టుబడుతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగ‌లకు తెలంగాణ ప్ర‌భుత్వం ఎప్పుడు అండ‌గా ఉంటుంద‌ని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. గిరిజనులకు న్యాయం జరగాలని నిత్యం ఆలోచన చేసే నాయ‌కుడు తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రత్యేక కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్లు 6% నుండి 10% శాతం కి పెంచాలని 2017వ సంవత్సరం లో అసెంబ్లీలో బిల్లు పెట్టి దానిని ఏకగ్రీవంగా ఆమోదించారని ఆయన గుర్తు చేశారు. అదే ఏడాది ఆ బిల్లు ను రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి పంపించడం జరిగిందని తెలిపారు. ఆ బిల్లులో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఎస్‌.సి, బీసీల‌కు కూడా న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

2017 లో కేంద్రానికి బిల్లు పంపిన నాటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా 16వ, 17వ లోక్ సభ ,రాజ్యసభ ల్లో ఈ అంశంపై లేవనెత్తిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కి ఎన్నో లేఖలు రాయడం తో పాటుగా పలుమార్లు నేరుగా కలసి గుర్తు  చేసిన‌ట్టు వివ‌రించారు. తెలంగాణ గిరిజ‌న శాఖ మంత్రి కూడా పలుమార్లు కేంద్ర మంత్రులతో మాట్లాడారని తెలిపారు. అలాంటిది తమకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి బిల్లులు, వినతులు అందలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఎంపీ నామ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో పార్లమెంట్ కు ఎంతో విలువ ఉందని నొక్కి చెప్పారు. అలాంటి పార్లమెంట్ లో కేంద్ర మంత్రి తప్పుగా సమాధానం ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే కేంద్రం అక్కసుతో ఉందని వివ‌రించారు. అస‌లు తెలంగాణ అంటే ఎందుకు ప‌గో కేంద్రానికి వివ‌రించాల‌ని డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రమైనా వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకా? అని నిల‌దీశారు. అది తెలంగాణ బిడ్డలు ముఖ్యంగా గిరిజనుల పై చూపించడం తో తేటతెల్లం అయిందన్నారు. పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేంద్ర ట్రైబల్ మంత్రి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం చెయ్యాల్సిన దానిని మొత్తం చేస్తుందని అందులో భాగంగా అన్ని తండా లను పంచాయతీ లుగా మార్చడం జరిగిందని వారికి అవసరమైన తాగు, సాగు నీరు అందించడం జరుగుతోందని పేర్కొన్నారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల మేలు కోసం వారి అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క కేంద్ర ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలతో మొండి మాటలు చెపుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పార్లమెంట్ సాక్షిగా గిరిజనులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించిన క్రిష్టియన్ మిషనరీ స్కూలు

Satyam NEWS

ఫిబ్రవరి 23న విష్ణుసహస్రనామ పారాయణం

Satyam NEWS

ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలి

Bhavani

Leave a Comment