నూతన రెవిన్యూ చట్టం తీసుకురావడం వలన తరతరాల నుండి వెంటాడుతున్న భూసమస్యలకు పరిష్కా రం దొరుకుతుందని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న MLA సైదిరెడ్డి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవిన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీని వలన భూ ఆక్రమణలు,భూకబ్జా దారుల నుండి భూములను రక్షించుకోవచ్చని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతులు తమ సొంత భూములు ఆన్ లైన్ లో నమోదు కాక , పట్టా పుస్తకాలు రాక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,దీనివలన అర్హులైన రైతులు రైతుబందు, రైతుభీమా లాంటి పథకాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకు వచ్చిందని అన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని, అందరూ పారదర్శకంగా పని చేయాలని కోరారు.
ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశంలో నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, ముఖ్యంగా పులిచింతల ముంపు ప్రాంతం సమస్యలు, అర్హులైన వారికి నష్ట పరిహారం, ముంపు ప్రాంతాలలో మౌలిక సమస్యలు, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు.
నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సభ్యులు అందరూ రైతుల అభ్యున్నతికి పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ జగన్ నాయక్, ఎంపీపీ ముడావత్ పార్వతి కొండా నాయక్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.