పోడు భూముల సమస్య పరిష్కారం కై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి వివరాలను కేసీఆర్ అందజేశారని, త్వరలోనే పోడు భూముల సమస్య పూర్తిగా తీరనున్నదని ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు తమ చేతిలో కీలుబొమ్మలుగా సిబిఐ, ఈడి లను వాడుకుంటూ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, బిజేపి ఉడత ఊపులకు తెలంగాణ బిడ్డలు భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంపై అనేక కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ఈడీ దాడులతో టిఆర్ఎస్ నాయకులను కేంద్ర బిజెపి భయపెట్టించాలని చూస్తున్నారని తెలిపారు.
టిఆర్ఎస్ పార్టీ నాయకులను లొంగదీసుకునేందుకే తమ చేతిలో కీలుబొమ్మగా ఉన్న ఈడి లను రాష్ట్రంలో ఉపయోగించి మొన్న నామ నాగేశ్వరరావు , నిన్న మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ రవిచంద్ర, నేడు మంత్రి మల్లారెడ్డి పై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తెలంగాణ గడ్డపై స్వామీజీల ముడుపుల రూపంలో పట్టుబడిన బిజెపి నాయకుల బండారం బయటపడిందని ఈ వ్యవహారంతోనే బిజెపి పార్టీ గోరి కట్టడం ఖాయమని తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , నగర మేయర్ నీరజ, రాష్ట్ర విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతు సమన్వయ కోఆర్డినేటర్ నల్లమల్ల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ కమర్తపు మురళి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖమార్, రూరల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు