రాష్ట్రంలో కమ్మ కులం వారికి అధికార వైసీపీ తీరని అన్యాయం చేస్తున్నదని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన కొడుకు ప్రస్తుత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. తన తండ్రి ఇలాగే అనవసరపు వ్యాఖ్యానాలు చేస్తుంటారని కూడా ఆయన తన తండ్రినే విమర్శించారు. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సీనియర్ నాయకుడు వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ కు రాబోయే ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చే అంశంపై వైసీపీ పునరాలోచనలో పడ్డట్టు చర్చ జరుగుతున్నది. ఆయన స్థానంలో మైలవరంలో వైసీపీ అభ్యర్ధిగా ప్రస్తుత మంత్రి, బీసీ నేత జోగి రమేష్ ను రంగంలో దించాలని వైసీపీ అగ్ర నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది.
వసంత క్రిష్ణ ప్రసాద్ పనితీరు ఏ మాత్రం బాలేదని ఇప్పటికే సర్వే నివేదికలు వెల్లడిస్తున్న వేళ ఆయన కు టిక్కెట్ ఇవ్వడం కూడా సరికాదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. నిజానికి మైలవరంలో బీసీలు ఎక్కువ. అందువలన బీసీ నేత జోగి రమేష్ కు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది అని ప్రచారంలో ఉంది. దానికి తగినట్లుగా వైసీపీ అడుగులు వేసేందుకు వసంత నాగేశ్వరరావు పెద్ద నోరు చేసుకుని తమ సొంత కులం మీటింగులో మాట్లాడిన మాటలు మంటనే పుట్టించాయి. కమ్మలకు ఏపీలో ఏమీ గౌరవం లేదని ఆయన అనడమే కాదు జగన్ మీద డైరెక్ట్ గానే కామెంట్స్ చేసారు. పైగా జగన్ వద్దనుకునే అమరావతినే బెస్ట్ రాజధాని అంటూ కితాబు ఇచ్చారు. మైలవరంలో ఇసుక దందా జరుగుతోందని ఎటు చూసినా పెద్ద ఎత్తున భూకబ్జాలు పెరిగిపోయాయని ఇప్పటికే టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎన్నో సార్లు విమర్శలు చేశారు. ప్రభుత్వం కూడా వాటి మీద నిజానిజాలు అన్నీ రెడీ చేసి దగ్గరపెట్టుకుంది అంటున్నారు. తండ్రి మాటల్ని ఖండించి, తండ్రిని చులకన చేసి మాట్లాడినా కూడా వైసీపీ అగ్ర నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ ను నమ్మడం లేదని అంటున్నారు.