ధాన్యo సేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంతవరకు ఎంత మేర ధాన్యం, ఎంతమంది రైతుల నుండి సేకరించింది ఆడిగి తెలుసుకున్నారు.
ధాన్య సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఓపిఎంఎస్ నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల గురించి అడిగి తెలుసుకుని, సేకరించిన ధాన్య రవాణాకు వాహనాలు వెంటనే సమకూర్చాలన్నారు. లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ వెంట వెంటనే జరిగిన పర్యవేక్షణ చేయాలన్నారు.
అనంతరం బోనకల్ రోడ్, శ్రీరాంనగర్ లోని శ్రీ సాయినాథ్ మోడ్రన్ రైస్ మిల్, కొత్తూరు ధాంసలాపురం లోని భాగ్యలక్ష్మి రైస్ మిల్లులను సందర్శించి, ధాన్య సేకరణ తనిఖీలు చేశారు. మిల్లులకు ఎంత ధాన్యం కేటాయించింది, ఇప్పటి వరకు ఎంత సేకరించింది, ప్రతిరోజు ఎంతమేర ధాన్యం అన్లోడ్ చేసుకుంటుంది అడిగి తెలుసుకున్నారు.
లక్ష్యం కంటే సేకరణ చాలా తక్కువ ఉండడం, అన్లోడ్ విషయంలో నెమ్మదిగా ఉండడంతో, వేగం పెంచాలని, రోజుకు కనీసం 4 లోడులు అన్లోడ్ చేయాలని, సేకరణ లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. మిల్లర్లు అలసత్వం వహించడం, సేకరణకు రైతుల నుండి కటింగ్ చేయడం చేస్తే చర్యలు తప్పవని, మిల్లులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.