ఆర్ధిక మాంద్యం, పారిశ్రామిక మంద గమనంపై ప్రభుత్వం గత కొద్దినెలలుగా ప్రకటించిన చర్యలతో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కార్పొరేట్ ట్యాక్సుల తగ్గింపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమీకరణ, నిలిచిపోయిన నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ఆమె గుర్తుచేశారు.
ఆర్థిక అంశాలపై ప్రభుత్వం కసరత్తు మరింత వేగంగా కొనసాగిస్తున్నదని, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. సోమవారం నుంచి బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కార్పొరేట్లకు రూ 2.2 లక్షల కోట్లు, చిన్నమధ్యతరహా కంపెనీలకు రూ 72985 కోట్ల రుణాలు మంజూరు అయ్యాయని దీనివల్ల పరిశ్రమల రంగం కుదుటపడే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. రిటైల్ రుణాల జారీ కోసం ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు రూ 4.47 లక్షల కోట్లు మంజూరు చేశామని తెలిపారు.