హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి గ్రామాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన టి. ఆకాశ్ పాత నేరస్తుడు. 2013లో అతడిని షాహినాయత్గంజ్, ఛత్రినాక పోలీసులు దొంగతనం కేసుల్లో అరెస్ట్ చేశారు.జైలు నుంచి బయటకు వచ్చిన అతడు ఇటీవల తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఆకాశ్కు మహబూబ్నగర్ జిల్లా కర్వెన గ్రామానికి చెందిన మహ్మద్ సోహెల్ పరిచయమయ్యాడు. ఆకాశ్ హైదరాబాద్లో చోరీ చేసిన వాహనాలను తక్కువ ధరకు మహ్మద్ సోహెల్ కొనుగోలు చేస్తున్నాడు. ఆ వాహనాలను సోహెల్ గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఆకాశ్ ఛత్రినాక, షాహినాయత్గంజ్, కామాటిపుర,కాచిగూడ, మొఘల్పుర, మాదన్నపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి, సోహెల్కు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్జోన్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, ఛత్రినాక అదనపు ఇన్స్పెక్టర్ నాగరాజ్ కలిసి నిందితుడిని పట్టుకున్నారు. విచారించగా నేరాలను అంగీకరించడంతో పాటు రిసీవర్ మహ్మద్ సోహెల్ పేరును కూడా బయటపెట్టాడు. దీంతో జడ్చర్లకు వెళ్లిన పోలీసులు 16 వాహనాలను సోహెల్ నుంచి రికవరీ చేశారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ స్నేహా మెహ్రా తదితరులు పాల్గొన్నారు.
previous post