దేశానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అన్నదాతల మేలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా రెండు, మూడు రోజుల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ధాన్యం సేకరణ, రవాణా ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇప్పటికే ఇరు జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ను ఆరా తీశారు. పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులకు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలన్నారు.
నిర్ణీత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 380 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం మిల్లుకు వెళ్లిన తర్వాత ఎలాంటి కోతలు ఉండొద్దని, ఇలాంటి ఘటనలు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వడ్లు కొనమంటే కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీకి చేతకాదు కానీ రూ. 100ల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటోందని, కేంద్ర మంత్రులు ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్తూ నూకలు తినాలని వెటకారమాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఎఫ్సీఐ నుంచి రావాల్సిన డబ్బులు రాకున్నా తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం కొంటుందన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత పంట పండలేదన్నారు.